కేసీఆర్ స‌ర్కార్‌కు షాక్‌..

హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని చిక్కులు ఎదురుకానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ వేదికగా సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీటీసీల సంఘం ఆధ్వ‌ర్యంలో కొన్ని డిమాండ్ల‌ను అధికార పార్టీ ముందుంచారు. అవి నెర‌వేరుస్తామ‌ని చెబితేనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు చెబుతామ‌ని వెల్ల‌డిస్తున్నారు. ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 15 వేలకు పెంచాలని, పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం ఉండాలని, పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం కల్పించాలని.. ఇలా ఆరు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు.

16వ తేదీ డెడ్‌లైన్‌..

ఈ నెల 16వ తేదీకల్లా వీటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని, లేక‌పోతే తాము సొంత నిర్ణయం ప్రకారమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా ఆలోచిస్తామని సంఘం అధ్యక్షుడు కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల ప్రక్రియ ముగిసేలోపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 500 కోట్లను స్థానిక సంస్థలకు కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ డబ్బులు విడుదల చేయలేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు వారి నిధులను జిల్లా, మండల పరిషత్తు ద్వారా స్థానిక సంస్థలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ఈ నెల16వ తేదీలోగా పరిష్కరించకపోతే తాము కూడా పోటీ చేయక తప్పదని వెల్ల‌డించారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఏదిఏమైనా కేసీఆర్ స‌ర్కార్ ఎంపీటీసీల విష‌య‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like