కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా?

-హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది
-రూ. 7,500 చొప్పున బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?
-బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-బీజేపీని ఓడించేందుకు గుంట‌న‌క్క‌ల పార్టీలు ఒక్క‌ట‌వుతున్నాయి
-మేం సింహం... సింగిల్‌గానే వ‌స్తం
-ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి
-కేసీఆర్ భూ దందా బంద్ చేయాలి
-లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరిక

Bandi Sanjay Kumar: కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు చొప్పున మార్కెట్ లో అమ్మకానికి పెడుతూ ఈరోజు పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. రూ.550 కోట్ల విలువైన భూమిని 40 కోట్లలోపే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ సోయం బాపూరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్, జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఓపెన్ మార్కెట్ కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కట్టబెట్టిన భూముల విలువ రూ.1100 కోట్లకు పైమాటేనన్నారు. ఈ భూమి ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేక కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని దుయ్య‌బ‌ట్టారు. అయినా మీడియాకు మాత్రం ఈ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచి ప్రజల ఆస్తులను కొట్టేశారని మండిపడ్డారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్ సొంత పార్టీకి కేటాయించుకునేందుకు భూములెక్కడినుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం అత్యంత కారు చౌకగా భూమిని కొట్టేసిన కేసీఆర్ ఆ భూములు చాలవని ‘‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్’’ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని కాజేయడం దుర్మార్గమన్నారు.

ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ జీవో పరిధిలోని పేదల భూములను కొనుగోలు చేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు… ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసుకుని గజాల చొప్పున అమ్ముకుంటూ లక్షల కోట్ల రియల్ దందాకు తెరదీశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పెద్దఎత్తున ఉద్యమించి సర్కార్ భూ భాగోతాన్ని ఎండగడతామని చెప్పారు. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2008లో హైదరాబాద్ లోని బోయినిపల్లిలో 10 ఎకరాల పైగా స్థలాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టింది. ఈరోజు బీఆర్ఎస్ ఆ పనిచేసింది. ఇంతకంటే దారుణం, మోసం ఇంకోటి లేదని బండి సంజ‌య్ దుయ్య‌బ‌ట్టారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానిక స్థలం లేదంటారు జీతాలివ్వడానికి పైసల్లేవంటారు దోపిడీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని బండి దుయ్య‌బ‌ట్టారు. ఇది భరించలేకే ఏలేటి, రామారావు కాంగ్రెస్ వీడి బీజేపీలోకి వచ్చారని అన్నారు. ప్ర‌భుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని సంజ‌య్ దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ నేతలు దొడ్డిదారిన దోచుకోవడానికి భూములు ఎట్లా వస్తున్నాయో సంగతి తేలుస్తామ‌న్నారు. ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు ఇవ్వాలని. వెంటనే సీఎం కేసీఆర్ ఈ భూ దందాను బంద్ చేయాల‌న్నారు.

కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేందని బండి సంజ‌య్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.. దేశంలో 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో గెలిచింది.. మరి ఇక్కడ రాలేదు కదా?… అట్లాగే కర్నాటకలో ఓడిపోతే.. తెలంగాణకు సంబంధం ఏంది? రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని తేలిపోయిందని స్ప‌ష్టం చేశారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమ‌ని చెప్పారు. అందుకే బీజేపీని అడ్డుకోవడానికే గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయ‌న్నారు. బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీ చేసి పూర్తి మెజారిటీతోనే అధికారంలోకి రాబోతోందని తెలిపారు. సీఎం సహా అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇవే చెబుతున్నాయి.

ఇది తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కొత్త నాటకాలు షూరూ చేసినయ్ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణలోని బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లోకి పోతారని ప్రచారం చేస్తున్నయ్. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని తెలిసీ ఆ పార్టీని లేపేందుకు డ్రామాలాడుతున్నయన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్లలో 12 మంది బీఆర్ఎస్ లోకి పోయారని చెప్పారు. ఉన్న ఐదుగురిలో నలుగురు నాలుగు స్థంభాలాట ఆడుతున్నరు. ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like