లం..కొడ‌కా.. నీ అంతు చూస్తా..

సీఐపై ఎమ్మెల్సీ బూతుపురాణం

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డిపై తిట్ల‌తో రెచ్చిపోయారు. ప‌త్రికా భాష‌లో రాయ‌లేని బూతు పురాణం అందుకున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి చెందగా.. కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన పైలట్‌ రోహిత్‌ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం కేసీఆర్‌.. అయితే, పలు సందర్భాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి.. మరోవైపు.. ఈ ఇద్దరు నేతల మధ్య అధికారులు కూడా నలిగిపోతున్నారు. పోలీసులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

తాజాగా సీఐని నానా బూతులు తిట్టారు. తాండూరు పట్టణంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు… ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? రా లం… కొడకా..! నీ అంతు చూస్తా..! అని వార్నింగ్‌ ఇచ్చారు. పద్ధతిగా మాట్లాడాలని సీఐ వారిస్తుంటే.. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు.. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరా.. రా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? అంటూ సీఐకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఇప్పుడా ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో క్ర‌మంగా ప‌ట్టుకోల్పోతున్న మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బూతు పురాణాన్ని ఎంచుకున్నారు. కొద్ది మాసాల క్రితం గ్రామ పంచాయ‌తీల‌కు ఫాగింగ్ మిష‌న్ ల‌ను పంపిణీ చేసిన స‌మ‌యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి స‌బితారెడ్డి ముందే మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ చంద్ర‌య్య‌పై నోరు పారేసుకున్నారు. జిల్లాలో ఎలా ప‌నిచేస్తావో చూస్తానంటూ అద‌న‌పు క‌లెక్ట‌ర్ ను బెధిరించారు.

కొద్ది రోజులుగా తాండూరు మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆర్డీఓ అశోక్ కుమార్ ను మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఎలాగైనా ఇక్క‌డి నుంచి బ‌దిలీ చేయిస్తాన‌ని.. లేదంటే స‌స్పెండ్ చేయిస్తాన‌ని ప‌లుమార్లు బెధిరింపుల‌కు పాల్ప‌డ్డారు. అనేక మార్లు ఫోన్ లో ఆర్డీఓ అశోక్ కుమార్ పై మ‌హేంద‌ర్ రెడ్డి దుర్భాష‌లాడారు.

రెండు రోజుల క్రితం తాండూరు పోలీసు స‌ర్కిల్ ప‌రిధిలోని యాలాల ఎస్ఐ అర‌వింద్ కుమార్ పై ఒక స‌మావేశంలో బ‌హిరంగంగా మ‌హేంద‌ర్ రెడ్డి బూతుల పురాణాన్ని వ‌ల్లించారు. అరేయ్.. ఎస్ఐ అంటూ గ‌ట్టిగా ప‌లుమార్లు స‌భావేదిక‌పై నుంచి కేక‌లు వేస్తూ ఎస్ఐను బెధిరించే ప్ర‌య‌త్నం చేశారు. రంజాన్ కిట్ల పంపిణీ సంద‌ర్భంగా బ‌షీరాబాద్ మండ‌ల త‌హ‌సీల్దార్ వెంక‌ట‌స్వామి పై కూడ ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి చిందులేశారు. బ‌హిరంగా వేధిక‌పై నుంచి అంతు చూస్తా అంటూ త‌హ‌సీల్దార్ ను బెధిరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like