తమ్ముళ్లకు రాఖీ కట్టి కన్నుమూసిన అక్క..

ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చావుబతుకుల మధ్య ఉంది. ఇక తాను బతకనని తనకు కూడా అర్ధమయ్యింది.. అందుకే తన అన్న, తమ్ముడికి రాఖీ కట్టింది. ఆ గంటలోపే కన్ను మూసింది. హృదయవిదారకమైన ఘటన మహబూబాబాద్లోని నర్సింహులపేటలో చోటు చేసుకుంది. కోదాడలో డిప్లొమా చేస్తున్న 17 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కలత చెంది అతడిని ఎదుర్కోలేక విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి క్షీణించింది. దాంతో తన అన్నకు, తమ్ముడికి రాఖీ కట్టగలనో లేదో అని భావించింది. సోమవారం వరకు బ్రతుకుతాననే ఆశను కోల్పోయింది. అందుకే అమ్మను పిలిచి చెప్పింది. అన్నా, తమ్ముడికి శనివారమే రాఖీ కడతానని తెలిపింది. ఆస్పత్రి బెడ్ మీద ఉండే వారికి రాఖీ కట్టింది.సోదరులకు రాఖీ కట్టిన గంట వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఆమె మరణం సోదరులను, తల్లిదండ్రులను కలచివేసింది.