అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఎక్కడికి వెళ్లారంటే..
ముగ్గురు బాలికలు కనపడకుండా పోయారు.. వారు ఎక్కడికి వెళ్లారు…? ఎక్కడ ఉన్నారనేది అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులకు కునుకు లేకుండా చేసింది. ఒకేసారి ముగ్గురు బాలికలు తప్పిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. చివరకు వారిని పోలీసులు వారి జాడ కనిపెట్టారు. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారంటే…
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా ఈనెల 2న(గురువారం) ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేశారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లకుండా బోధన్ బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అయితే స్కూల్కి రాకపోవడంతో పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఉదయాన్నే బయలుదేరి పాఠశాలకు వచ్చారని తల్లిదండ్రులు చెప్పగా.. ఇక్కడికి రాలేదంటూ వారు సమాధానం ఇచ్చారు.
బాలికల కోసం వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. గురువారం సాయంత్రం వరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలికల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అమ్మాయిలు ముందుగా వారు నవీపేట నుంచి బోధన్ వెళ్లారు. అనంతరం బోధన్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ ప్రాంతాలకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం నవీపేటకు చేరుకున్నారు. మళ్లీ వాళ్లు ఆటోలో నిజామాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ బాలిక మాత్రం తాను రానని చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. తాము నిజామాబాద్లో ఉన్నట్లు చెప్పగా తిరిగి అక్కడికి వెళ్లిపోయింది.
అయితే బాలిక అక్కడికి వెళ్లే సరికి మిగతా ఇద్దరూ అక్కడ లేరు. దీంతో విద్యార్థిని నిజామాబాద్ బస్టాండ్లోనే ఉండిపోయింది. అప్పటికే వీరి కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ చిన్నారి కనిపించింది. మిగతా ఇద్దరి గురించి ఆరా తీయగా, జరిగిన విషయం మెుత్తం పోలీసులకు చెప్పింది. శుక్రవారం సాయంత్రం మిగతా ఇద్దరు కూడా నిజామాబాద్ బస్టాండ్కు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము గురువారం రాత్రంతా కరీంనగర్ బస్టాండ్లో ఉన్నట్లు విద్యార్థినిలు చెప్పారు. ముగ్గురు విద్యార్థినులు దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఉచిత బస్సు పథకం కావడంతో తామంతా కొత్త ప్రాంతాలకు వెళ్లి తిరిగి రావాలనుకున్నామని అందుకే బస్సుల్లో తిరిగేశామని ఆ బాలికలు చెప్పడం…