దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి
Encounter: దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శనివారం అర్ధరాత్రి మరో ఎన్ కౌంటర్ జరిగింది. దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు మృతి చెందగా, దంతెవాడ DRG హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలం నుంచి భారీగా అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నారాయణ్పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శనివారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ DRG హెడ్ కానిస్టేబుల్ కరమ్ సన్ను మృతి చెందారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎస్ ఎల్ ఆర్, లేటెస్ట్ ఆటోమేటిక్ వంటి ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.