రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లింపు
Singareni: తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి సంస్థ రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి సీఎండీ ఎన్.బలరామ్ చెక్కును అందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం కింద రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ 88,55,99,147 రూపాయల డివిడెండ్ చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్ చెక్కు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకి శనివారం రాత్రి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూల ధనం (పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ) లో 10 శాతాన్ని డివిడెంట్గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు రూ.173 కోట్లు కాగా.. సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో నుంచి 88.55 కోట్ల రూపాయలను డివిడెండ్గా చెల్లించారు. సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలు తీర్చుతూ లాభాలను ఆర్జిస్తూ కార్మికులకు లాభాల వాటా చెల్లించడమే కాకుండాప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు చెల్లించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.