సుప్రీంకోర్టులో చుక్కెదురు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన దాఖలు చేసిన‌ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ బుధవారం (జనవరి 15) విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల్లో తాము జోక్యం చేసుకోబోని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ డిస్మిస్ చేసే పరిస్థితి ఉండటంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది.

విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని.. కేటీఆర్ ఒక్క రూపాయి తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13 (1)ఏ ఎలా వర్తిస్తుందని.. ఇందులో పీసీ యాక్ట్ 13(1A) వర్తించదని కేటీఆర్‌ తరపు న్యాయవాది వాదించారు. వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

కేటీఆర్‌ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like