మాదారం అడవుల్లోకి..
Tiger: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి మాదారం అడవుల్లోకి ప్రవేశించింది. కన్నాల-బుగ్గ అటవీప్రాంతంతో పాటు కాసిపేట వైపు సంచరించిన ఈ పులి కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్ వైపు అధికారులు వెల్లడించారు. పాదముద్రల ఆధారంగా ట్రాకింగ్ బృందం పులి ఎటు వైపు వెళ్లిందనే అంశం ఎప్పటికప్పుడు చెబుతున్నారు. కన్నాల-బుగ్గ అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెద్దనపల్లి, సోమగూడెం దుబ్బగూడెం, బుగ్గ గూడెం, కొత్తవరిపేట అటవీ ప్రాంతాల్లో సంచరించింది. పెద్దపులి భయంతో బెల్లంపల్లి నుంచి బుగ్గ దేవాలయానికి వెళ్లే రహదారిని మూసేశారు. బుగ్గగూడెం, బోయపల్లి రోడ్లలో కూడా వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు సైతం విధించారు.
ఆదివారం పెద్దపులి బుగ్గదేవాలయం సమీపం లోని కొండపోచమ్మ గుడి పక్క నుంచి అంకుశం గుట్టల మీదుగా తాండూర్ మండలంలోని మాదారం బీట్ లోకి వెళ్లింది. ఇప్పుడు ఆ పులి అంకుశం నుంచి మాదారం ప్రాంతంలోని గొంతెమ్మ గుట్టల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 12 రోజులుగా కన్నాల అటవీప్రాంతంలో సంచరిస్తూ ట్రాప్ కెమెరాలకు చిక్కింది. బెల్లంపల్లి పట్టణానికి అతి సమీపంలోనే కన్నాల అటవీ ప్రాంతంలో పులులు మాటు వేశాయి. వారం రోజుల కిందట అడవి పందిని చంపిన పెద్దపులి బీ -2 గా అధికారులు గుర్తించారు. కన్నాల గ్రామ పంచాయతీ శివారులో నీ అటవీ ప్రాంతం నీటి కుంటలు, పత్తి చేన్లు పెద్దపులికి ఆవాసంగా మారాయి.
బెల్లంపల్లి కెమికల్ ఏరియా, కాల్టెక్స్ ప్రాంతాల్లో సైతం పెద్దపులి పాదముద్రలు గుర్తించడంతో సమీప ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు సైతం ప్రకటించాయి. వేటగాళ్ల నుంచి పెద్దపులిని రక్షించేందుకు 15 మందితో కూడిన ఎనిమల్ ట్రాకింగ్ టీంతో నిరంతరం అటవీ ప్రాంతంలో పులిని పర్యవేక్షిస్తున్నారు. మాదారం అడవుల్లోకి పులి ప్రవేశించడంతో పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి స్పష్టం చేశారు.