చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ

Tirumala Tirupati Temple:తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఏకంగా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)కు లేఖ రాశారు. మీరు ఆదేశించినా టీటీడీ వాటిని పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇంతకీ కొండా సురేఖ చంద్రబాబుకు ఏ విషయంలో ఫిర్యాదు చేశారంటే..
హిందూ భక్తులకు తిరుమల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ వేంకటేశ్వరుడిని కలియుగ ప్రత్యక్షదైవంగా భావిస్తారు. ప్రతిరోజు స్వామి వారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారికి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఎన్ని గంటలైనా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తారు. ఇటీవల తెలంగాణ నుంచి వస్తున్న కొంత మంది భక్తులు ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల సిఫారసుల లెటర్లు తీసుకుని స్వామి దర్శనం కోసం వస్తున్నారు.
టీటీడీ (Ttd) అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడంలేదు. దీంతో తెలంగాణ నుంచి వస్తున్న భక్తులు తీవ్ర మనోవేదనకు గురతున్నారు. గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతల నుంచి సిఫారసు లెటర్ లు తీసుకొని వచ్చే భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. కానీ టీటీడీ మాత్రం సీఎం ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంలోనే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గతంలో మీరిచ్చిన ఆదేశాలను టీటీడీ బేఖాతారు చేస్తోందని స్పష్టం చేశారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి.. గతంలో చెప్పిన విధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు 500 రూ. వారానికి రెండు, 300 రూ. దర్శనాలు వారానికి రెండు.. సిఫారసులను వెంటనే అమలయ్యేలా టీటీడీని ఆదేశించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.