అడవులు, ప్లాంటేషన్లు కాలితే పర్యావరణానికి నష్టం
-ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్

అడవులు, ప్లాంటేషన్లు కాలితే చిన్న చిన్న జీవరాశులు చనిపోతాయని పర్యావరణానికి నష్టమని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం చెన్నూర్ మండలం పొన్నారం నీలగిరి ప్లాంటేషన్ సమీపంలోని చాకేపల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులు, ప్లాంటేషన్ల మీదుగా రాకపోకలు సాగించే వారు సిగరెట్, బీడీలు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు. ప్లాంటేషన్, అటవీ ప్రాంతం చుట్టు పక్కల పొలాల వారు సాగు తర్వాత మిగిలిన గడ్డి, చెత్తను తగలబెట్టి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాలులు చెలరేగే సమయంలో ఆ మంటలు అడవుల్లోకి వెళ్లే ప్రమాదముందన్నారు. అలా చేయవద్దన్నారు. ప్రమాదవశాత్తు అటవీప్రాంతంలో మంటలు చెలరేగితే సమాచారం ఇచ్చి అడవులు పరిరక్షణకు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో చాకెపల్లి మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్లు సారయ్య,జంపయ్య, ఫీల్డ్ సూపర్ వైజర్ శ్రీనివాస్,వాచర్ ఓదెలు, సంజీవ్ పాల్గొన్నారు.