తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. దండేపల్లి మండలం కొర్విచెల్మలో నేలకు ఒరిగి తీవ్ర నష్టం జరిగిన మక్క పంట పరిశీలించి, నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల జిల్లా వ్యాప్తంగా పంటలకు నష్టం జరిగిందన్నారు. దాదాపు మూడు రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్ట పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎంత మేర నష్టం జరిగిందో కూడా ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయకపోవడం శోచనీయమన్నారు.
అకాల వర్షంతో రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గోపతి రాజయ్య, ముఖేష్ గౌడ్,బోడకుంటి వెంకటేష్, పతిపాక సంతోష్, కొండ నరేష్, బత్తుల శేఖర్, అప్పని తిరుపతి, మల్యాల రమేష్, గడికొప్పుల సురేందర్, దుమ్మని సత్తయ్య పాల్గొన్నారు.