మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్ల తనిఖీ

ప్రాణహిత తీరంలోని మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్లను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, గతంలో జరిగిన సంఘటనల వివరాలు, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి..? మావోయిస్టులకు సంబంధించి, వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా…? అని తెలుసుకున్నారు. సానుభూతి పరులు, మిలిటెంట్స్, మావోయిస్టుల కదలికలు అధికారులను, సీనియర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధుల్లో ఎల్లపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రిసెప్షన్ సిబ్బందిని అడిగి ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికి నమ్మకం కల్పించాలని స్పష్టం చేశారు. చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బందితో మాట్లాడి వారి వివరాలు, చేస్తున్న విధులు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, NIB ఇన్స్పెక్టర్ కరుణాకర్, చెన్నూర్ రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ ఉన్నారు.
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ…
అనంతరం ఆయన కన్నెపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాల పోస్టర్ పరిశీలించి వారి గురించి వివరాలు అడిగారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించి, జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు.