కేటీఆర్కు ఊరట
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆదిలాబాద్ కాంగ్రెస్ మహిళా నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో గతంలో కేటీఆర్పై ఉట్నూరు పీఎస్లో కేసు నమోదైంది.
రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్లో జరిగిన సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికలకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన పోలీసులు గత ఏడాది సెప్టెంబర్ 30 న బీఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసు కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్హై కోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేస్తూ జస్టిస్ కే.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రిలీఫ్ లభించింది.