మనవైపు చూస్తే విధ్వంసమే

Modi: భారతదేశం వైపు చూడటం వల్ల కలిగే ఏకైక ఫలితం విధ్వంసం.. భారతదేశ ప్రజల రక్తం చిందించడం వల్ల ఒకే ఫలితం ఉంటుందని, అది విధ్వంసం అని ప్రధాని మోదీ(Prime Minister Modi) అన్నారు. అదంపూర్ ఇండియన్ ఎయిర్ బేస్(Adampur Indian Air Base) సందర్శించి వాయుసేనను ఉద్దేశించి ప్రధాని మోదీ పవర్ఫుల్ ప్రసంగం చేశారు. ఉగ్రవాదులను కాపాడుతున్న పాకిస్తాన్ సైన్యాన్ని కూడా భారతదేశం ఓడించిందని పేర్కొన్నారు.
”మన సామర్థ్యం చూసి పాకిస్తాన్ కు కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ దాడులు చేసింది. పౌర విమానాలకు ప్రమాదం లేకుండా భారత్ చేసిన దాడి గర్వకారణం. భారత్ లక్ష్మణరేఖ సుస్పష్టమైంది. కవ్విస్తే భారత్ తగిన విధంగా సమాధానం చెబుతుంది. సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ తో ఇండియా సత్తా చూపాం. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు. ఉగ్రవాదులను, వారికి సహకరించే వారిని వేర్వేరుగా చూడబోము. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు భారత్ కొత్త విధానం. కచ్చితత్వంతో శత్రు స్థావరాలను ధ్వంసం చేశాం. అదంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింద”ని ప్రధాని మోదీ వెల్లడించారు.
భారత్ మాతా కీ జై నినాదం శక్తి ఏమిటో యావత్ ప్రపంచం చూసిందని అన్నారు. ఈ నినాదం శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షను ప్రస్పుటించిందన్నారు. భవిష్యత్ తరాలకు మీరు స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ సాధారణ సైనిక ఆపరేషన్ కాదన్నారు. భారతదేశం బుద్ధుని భూమి, గురు గోవింద్ సింగ్ భూమి కూడా అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాటల్లో.. అన్యాయాన్ని అంతం చేయడానికి ఆయుధాలు చేపట్టడం మన సంప్రదాయం. మా కూతుళ్ల నుదిటిపై ఉన్న సింధూరం లాక్కున్నప్పుడు, మేము వారి ఇళ్లలోకి ప్రవేశించి వారిపై దాడి చేశాము. వారు సవాలు చేసింది భారత సైన్యంతో అని మర్చిపోయారని మోదీ వెల్లడించారు.
భారత్కు చెందిన అదంపూర్ ఎయిర్ బేస్ ధ్వంసం చేశామని పాకిస్తాన్ అబద్దాలు ప్రచారం చేసింది.. ఈ నేపథ్యంలోనే ఆయన అదంపూర్ బేస్ వెళ్లి ఎయిర్ఫోర్స్ సిబ్బందిని అభినందించి అక్కడ వాయుసేన అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.