యూరియా తిప్పలు.. క్యూలో చెప్పులు..
Farmers’ struggles for urea:యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చెప్పులు క్యూలో పెట్టి రైతులు నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సొసైటీ కార్యాలయం వద్ద పాదరక్షలను లైన్ లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. గురువారం యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో మండలంలోని రైతులు వ్యవసాయ మారెట్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నిర్వాహకులు క్యూలో నిలబడాలని సూచించారు. వృద్ధులు, మహిళలు క్యూలో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి మరీ నిలబడ్డారు. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ వారు ధనాపేక్షతో పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు.
మహారాష్ట్ర కు యూరియా అక్రమంగా రవాణా జరుగుతోందని, దీంతో చెన్నూర్ లో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అక్రమ రవాణా జరుగుతున్నా అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు దుయ్యబట్టారు. మండలం లో జరుగుతున్న యూరియా అక్రమాలను అరికట్టి రైతులకు అవసరమైన యూరియా ను రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..