సింగరేణి లాభాల వాటా ఇలా చెల్లిస్తారు..
Singareni:సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటాను ఎలా కేటాయించేది సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. సింగరేణి కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.802.40 కోట్లు ప్రత్యేక ప్రోత్సాహకంగా కేటాయించిన విషయం తెలిసిందే.. ఇందులో అండర్ గ్రౌండ్ ఉద్యోగులకు ప్రతి మస్టరుకు ₹805.37 చెల్లిస్తారు. అదే విధంగా ఓపెన్కాస్టు, ఎస్టీపీపీ కార్మికులకు ₹637.58, సర్ఫేస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ₹588.53 చెల్లించనున్నారు.
ఇందులో మొత్తం ప్రోత్సాహకాన్ని హాజరు (85.30%), వ్యక్తిగత పనితీరు (0.70%), గ్రూప్ పనితీరు (14%) ఆధారంగా చెల్లిస్తారు. 01.09.2025 నాటికి ఉద్యోగంలో ఉన్నవారితో పాటు అర్హత కలిగిన మాజీ ఉద్యోగులకు కూడా చెల్లింపు ఉంటుంది. ఈ నెల 29 న యాజమాన్యం కార్మికుల అకౌంట్లలో జమ చేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి లాభాల్లో 34 శాతం సొమ్ము అంటే రూ. 819 కోట్లను కార్మికుల వాటాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
పర్మినెంట్ కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటాను ప్రకటించిన సింగరేణి యాజమాన్యం సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5,500 బోనస్ ప్రకటించింది. గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ. 5వేల చొప్పున బోనస్ ప్రకటించగా, ఈ ఏడాది రూ. 500 అదనంగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం నిర్ణయంతో సంస్థలో పని చేస్తున్న 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ది చేకూరనుంది.