రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం
TTD:టీటీడీ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సదుపాయాలు, సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారన్నారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు. అలాగే 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారన్నారు. ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 4.40 లక్షల మంది భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షలు మంది భక్తులు ప్రయాణించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.