ప్రాణాలకు తెగించి… దొంగల వీడియో తీసి..
దొంగలు డబ్బులు తీసుకుని పారిపోతున్నారు.. కొద్దిసేపు ఆందోళన, భయం.. కానీ ఆ యువకుడు వెంటనే తేరుకున్నాడు.. తన వాహనంతో దొంగలను వెంబడించాడు. వారిని వీడియో తీశాడు.. అది పోలీసులకు ఆధారమైంది.. దొంగలు దొరికారు… ఎంతో సాహసంతో వీడియో తీసి పోలీసులకు ఆధారాలు సంపాదించింనందుక ఆ యువకున్ని పోలీసులు అభినందించారు. శాలువాతో సత్కరించారు…
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వికాస్ మోజే స్థానిక వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు. ఈ నెల ఏడవ తారీఖున సాయంత్రం ఇచ్చోడ పట్టణానికి వెళ్లి అక్కడ డబ్బులను తీసుకొని అదిలాబాద్ కి తిరిగి వస్తుండగా దేవాపూర్ చెక్పోస్టు ప్రాంతంలో అతనిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న దాదాపు రూ. 4,15,000 తీసుకొని పారిపోయారు. బాధితుడు వెంటనే వారిని పట్టుకోవాలని వెంటపడ్డాడు. తన బైక్ వేగంగా నడిపించి వాళ్ల బండి, ముఖచిత్రాలు కనబడేలా వీడియో చిత్రీకరించాడు. నిందితులు పారిపోయే క్రమంలో వికాస్ మోజేపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయినా, బాధితుడు వారిని పట్టుకోవాలని ఆలోచనతో వీడియో తీయడంతో దొంగలు జాతీయ రహదారి నుంచి బట్టి సావర్గాం వైపు వెళ్తూ వాహనాన్ని విడిచిపెట్టి కంచెను దూకి పంట పొలాలలోకి వైపు పారిపోయారు. ఈ ఘటనపై డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఆదిలాబాద్ డీఎస్పీ, మావల సీఐ కేసు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లో పూర్తి చేసి నిందితులను పట్టుకున్నారు.
ఈ ఘటనలో జాదవ్ అంకుష్, ముండే సచ్చిదానంద్ ను 9న, కేంద్ర శంకర్(ప్రధాన నిందితుడు) 11న అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో వారి వద్ద నుండి రూ. 45,000 నగదు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితుడు తన ప్రాణాలకు తెగించి నిందితుల ముఖచిత్రాలు కనబడేలా ఆధారాలను సేకరించి పోలీసులకు అందజేయడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం వికాస్ మోజేని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించి మావల సీఐ కర్ర స్వామితో కలిసి శాలువాతో సత్కరించారు.