హాస్ట‌ళ్ల‌లో అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు.. రూ. 60 కోట్లు విడుద‌ల

CM Revanth Reddy:బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 60 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి కేటాయించిన ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు క‌లిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యాసంస్థలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారనాణ్యత తెలుసుకునేందుకు యాప్ ఉప‌యోగించాలి. విద్యార్థుల‌కు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి. దాంతో వారికి ల‌భించే కేల‌రీల‌ను తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో స‌క్ర‌మంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలి. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వ‌స‌తులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని వెల్ల‌డించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాల‌న్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాల‌ని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షిప్‌లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్య‌సాచి ఘోష్ ని ఆదేశించారు. సమీక్ష‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like