లొంగుబాటలో మరో మావోయిస్టు అగ్రనేత
Top Maoist leader Takkallapalli Vasudevarao@Aashanna to surrender:మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు@ఆశన్న@రూ పేశ్ సైతం లొంగుబాటలో పయనించారు. ఆయన సైతం రేపు లొంగిపోనున్నారు. ఖమ్మం జిల్లా తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఈ మావోయిస్టు నాయకుడు రాజకీయ, సైనిక విషయాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70 మంది పార్టీ కేడర్ తో చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్.. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నారు. తమ ఆయుధాలను సైతం అప్పగించనున్నారు. ఆయనతో పాటు ఈ బృందంలో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని సమాచారం.
లొంగుబాటుకు చకచకా ఏర్పాట్లు..
వీరంతా ఇప్పటికే జగ్దల్ పూర్ చేరుకున్నారని, రేపు నిర్వహించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈరోజు ఉదయం గడ్చిరోలిలో జరిగిన ఒక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే.
పార్టీలో వేగంగా ఎదిగి.. కేంద్ర కమిటీ సభ్యుడిగా..
తక్కళ్లపల్లి వాసుదేవరావు, 1970లో ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లాలో జన్మించాడు. ఆయన మావోయిస్టు ఉద్యమంలో 1990ల చివరలో చేరాడు. పార్టీలో నేగంగా ఎదిగాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాలు, ప్రచార విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. CPI-మావోయిస్టు పార్టీలో ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా, దక్షిణ భారత జోనల్ కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు ప్రచారాలు, రిక్రూట్మెంట్, ఫండ్ కలెక్షన్ విషయాల్లో నిపుణుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గడ్ రెడ్ కారిడార్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పదవి రాలేదని అసంతృప్తే కారణమా..?
2025 మేలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత, కేంద్ర కమిటీలో కొత్త నియామకాలు జరిగాయి. ఆ పదవికి ఆశన్నను నియమిస్తారన్న ప్రచారం సైతం సాగింది. అయితే, పార్టీ ఆయనకు జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వకపోవడంతో, ఆయనలో అసంతృప్తి పెరిగిందని సమాచారం. బదులుగా, మడావి హిద్మా మావోయిస్టు మిలిటరీ కమాండర్ ను దక్షిణ బస్తార్ జోనల్ కమిటీ సెక్రటరీగా నియమించారు. ఈ నిర్ణయం తెలుగు కేడర్లలో అసంతృప్తి రేకెత్తించింది. ఆశన్న రాజకీయ, సైనిక రెండు విషయాల్లోనూ సామర్థ్యం ఉంది. అటు ఈ అసంతృప్తి, పెరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆశన్నలొంగుబాట పట్టినట్లు సమాచారం.