సింగరేణి కార్మికులకు రూ. 400 కోట్లు బోనస్
Diwali Bonus To Singareni Workers: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిసారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించిందన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లా నుంచే సింగరేణి ప్రస్తానం మొదలైందన్నారు. సింగరేణి ఇప్పుడు రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగిందన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు, ఇతర ఇండస్ట్రీలకు పనికివచ్చే బొగ్గును.. సింగరేణి సరఫరా చేస్తోందని భట్టి విక్రమార్క కొనియాడారు.
కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింకు అవార్డు కింద సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 1,03,000 రూపాయలు చొప్పున దీపావళి బోనస్ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కోల్ ఇండియా ప్రతి సంవత్సరం సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు పిఎన్ఆర్ బోనస్ ను ప్రకటిస్తుంది. అయితే ఈ బోనస్ ఎంత ఇవ్వాలి అనేది మాత్రం సంస్థ లాభాలను బట్టి నిర్ణయిస్తారు. గత సంవత్సరం సింగరేణి కార్మికులకు 93,750 రూపాయల బోనస్ అందించిన కోల్ ఇండియా ఈసారి ఆ మొత్తాన్ని 1,03,000 రూపాయలకు పెంచింది. గతం కంటే 9,250 రూపాయల బోనస్ పెరిగింది.
కోల్ ఇండియా చరిత్రలో కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం ఇదే మొదటిసారి. 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో 21 వేలుగా ఉన్నటువంటి బోనస్ క్రమంగా పెరుగుతూ ఈసారి లక్ష రూపాయల మార్కును దాటింది. ఇండియాలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ఈ పీఎల్ఆర్ బోనస్ సెప్టెంబర్ లోనే అందగా సింగరేణిలో పనిచేసే కార్మికులకు మాత్రం ఇప్పుడు అందుతోంది.