శభాష్… ఆసిఫ్…
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన ఆసిఫ్ను డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) మంగళవారం పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన అనంతరం రియాజ్ పారిపోయాడు. ఆ సమయంలో అతడి కోసం పోలీసులు గాలించారు. పోలీసులు పట్టుకునే క్రమంలో రియాజ్ మళ్లీ దాడి చేసి పారిపోయే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆసిఫ్ ధైర్య సాహసాలు ప్రదర్శించి రియాజ్ను పట్టుకోవడానికి యత్నించాడు. అయితే నిందితుడు ఆసిఫ్పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డీజీపీ శివధర్రెడ్డి ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ తెలిపారు. ఆయన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆసిఫ్ ధైర్యసాహసాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తామని డీజీపీ తెలిపారు. రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. రెండు చేతులపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. అతడి చేతి నరాలు కట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్ర చికిత్స జరగడంతో కోలుకుంటున్నట్లు చెప్పారు. కాగా కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ను పట్టుకున్న తర్వాత జీజీహెచ్లో చికిత్స అందిస్తుండగా.. పోలీసుల తుపాకీ లాక్కొని పారిపోయే యత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడు చనిపోయిన విషయం తెలిసిందే.
డీజీపీ వెంట శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్(Mahesh M Bhagavat), హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తదితరులు ఉన్నారు.