సింగరేణి మ‌రో ముంద‌డుగు..

-సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధం
-ఎన్.ఎఫ్.టి.డి.సి సంస్థ సాంకేతిక సహకారంతో ప్రయోగాత్మకంగా ప్లాంటు ఏర్పాటు
-సింగరేణి ఓవర్ బర్డెన్, ఫ్లై యాష్, మట్టి, నిరుపయోగ మెటీరియల్ నుండి  అరుదైన కీలక ఖనిజాల గుర్తింపు
-త్వరలోనే పైలట్ ప్లాంటు నిర్మాణం
-సింగ‌రేణి సీఎండీ ఎన్. బలరామ్ వెల్ల‌డి

Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ దిశగా ఆ సంస్థ‌ మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్.ఎఫ్.టి.డి.సి (Non-Ferrous Materials Technology Development Center) తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్(Singareni CMD N. Balaram), ఎన్ఎఫ్టీడీసీ డైరెక్టర్ బాలసుబ్రమణియన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ వివరాలను సీఎండీ బలరామ్ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌తో సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను మరింత వేగవంతం చేస్తోంద‌న్నారు. దీనిలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్.ఎఫ్.టి.డి.సి సంస్థ నుంచి తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ లో సింగరేణి ఓవర్ బర్డెన్ మట్టిలో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో పాటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లో, ఇతర వేస్ట్ మెటీరియల్స్ లోను లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తిస్తామన్నారు. ప్రయోగాత్మకంగా వీటిని ఉత్పత్తి చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభ్యతా శాతం, ఉత్పత్తి అవకాశాలు, వ్యాపార కోణంలో లాభదాయకత తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఎండీ స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎఫ్.టి.డి.సి ఉన్నతాధికారులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో తాము ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించామని, కొన్ని కీలక ఖనిజాలు ఓవర్ బర్డెన్ మట్టిలోనూ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లోను ఉన్నట్లు గుర్తించామని, కొత్తగా స్థాపించనున్న పైలట్ ప్లాంటు ద్వారా మరింత సమగ్రమైన సమాచారం లభించనుందన్నారు. సింగరేణి సంస్థతో కలిసి పనిచేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.

కార్య‌క్ర‌మంలో సింగరేణి డైరెక్టర్ (పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లు, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జీఎం (బిజినెస్ డెవలప్మెంట్) రాందాస్, జీఎం (ఎక్స్ ప్లోరేషన్) శ్రీనివాసరావు, ఎన్.ఎఫ్.టి.డి.సి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like