72 మంది మావోయిస్టుల లొంగుబాట
Maoist Lays Down Arms: మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి… వరుసగా మావోయిస్టులు లొంగిపోతూనే ఉన్నారు. ప్రతిరోజూ లొంగుబాట్లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. బుధవారం సైతం చత్తీస్ఘడ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో 51 మంది, కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దాంతో ఈరోజు మొత్తం 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 51 మంది మావోయిస్టుల్లో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. వీరిలో పలువురు కమాండర్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.వీరిపై సుమారు 80 లక్షల పైగా క్యాష్ రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక కాంకేర్ జిల్లాలో లొంగిపోయిన 21 మంది మావోయిస్టుల్లో నలుగురు డిప్యూటీ కమాండర్లు, 9 ఏరియా కమాండర్లు ఉన్నారు. వీరిపై 66 లక్షల రివార్డు ఉంది.
కొన్నిరోజులుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మావోయిస్టు కీలక నేతల దగ్గర్నుంచీ కింది స్థాయిలో పని చేసే వరకూ చూస్తూ ప్రతీ రోజూ లొంగిపోతూనే ఉన్నారు. నిన్న పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్లు లొంగిపోయారు. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కొన్ని రోజుల కిందట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారి ప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు తమ ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.