రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) సందర్భంగా ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై అసభ్యకరంగా, వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలు చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. వారు జూబ్లీహిల్స్ ఎన్నిక రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) ధిక్కరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగతంగా, అవమానకరంగా మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడమే కాకుండా ఓటర్లలో ద్వేషం, అనుచిత భావోద్వేగాలు రేకెత్తించే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఉప ఎన్నికల శాంతియుత, స్వచ్ఛ, నిష్పాక్షిక నిర్వహణ కోసం రేవంత్ రెడ్డిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పి .శశిధర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ తదితరులు ఉన్నారు.