సింగరేణి సంస్థకు మరో అవార్డు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నుండి అవార్డు స్వీకరించిన సీఎండీ ఎన్. బలరామ్
Singareni:కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి(Singareni) సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవం వేడుకలలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Union Minister for Coal and Mines G. Kishan Reddy) ఈ అవార్డు సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్(Singareni CMD N. Balaram)కు అందజేశారు. దీనిపై సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తన హర్షం ప్రకటిస్తూ సింగరేణి సంస్థలో స్పెషల్ క్యాంపెయిన్ 5.0 ను విజయవంతం చేసిన ఉద్యోగులను, అధికారులను అభినందించారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ గ్రీన్ ఎనర్జీ వంటి ఉత్పత్తిలోనే కాదు పచ్చదనం, పరిశుభ్రతలో కూడా మంచి పేరు తీసుకురావడం సంతోషకరమన్నారు.
గత నెల గాంధీ జయంతి నుండి 30 రోజులు పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల ప్రాంతాలలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా సింగరేణి సంస్థ అన్ని ఏరియాల్లో కార్యాలయాలను, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడం, అవసరం లేని ఫైళ్లను గుర్తించి వాటిని తొలగించడం వంటి పనులు చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 355 ప్రదేశాలలో 7,65,583 చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్న ఫైళ్లను కూడా తొలగించారు.
1,70,000 ఫైళ్లను తనిఖీ చేసి వీటి నుంచి పూర్తిగా నిరుపయోగమని భావించిన 56,200 ఫైళ్లను సంబంధిత కార్యాలయాలు గనుల నుంచి తొలగించారు. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు కలిసి 14 సంస్థలలో ఈ కార్యక్రమం చేపట్టగా సింగరేణి సంస్థ అన్నింటినీ మించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.