మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్.. మృతుల్లో దేవ్జీ, ఆజాద్
Encounter:ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతం(Maredumilli forest area)లో బుధవారం ఉదయం మరోమారు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు(Maoists) హతమయ్యారు. కొన్నాళ్లుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మడావి హిడ్మా(Madavi Hidma) మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో హిడ్మా భార్య రాజక్క తోపాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే మరోసారి ఎదురుకాల్పులు జరిగినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ధృవీకరించారు. అల్లూరి జిల్లా జి.ఎం.వలస సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా తెలిపారు. మంగళవారం మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని లడ్డా తెలిపారు. వారిని పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని, నిఘా వర్గాలు వారి కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని ఆ ఘటనలో మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని తెలిపారు. ఘటనలో దొరికిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టామన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని చెప్పారు. ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమని చెప్పారు.
ఈ ఆపరేషన్లో కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నామన్నారు. వెపన్స్ 45, 272 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మా ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందని వారందరికీ అభినందలు చెబుతున్నామన్నారు. మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలు గమనించామని తెలిపారు. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని చెప్పారు. తెలంగాణలో కొంతమంది ఇటీవల లొంగిపోయారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారని, అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను ఎంచుకున్నారని చెప్పారు.