వణికిస్తున్న చలి
చలిపులి ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్ధాయిలో పడిపోవడంతో జనం వణికిపోతున్నారు. రాత్రి, ఉదయ ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో తగ్గిపోతున్నాయి. చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా.. ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితి నెలకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్(యూ) లో 4.8 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇక రాత్రి, ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం వేళల్లో కూడా చలి వదిలిపెట్టడం లేదు. మధ్యాహ్నం సమయంలో కూడా చలితో జనం జంకుతున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని ప్రజలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఇదే పరిస్థితి. సిర్పూర్ యూతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీ లో 5.9, నిర్మల్ జిల్లా కుంటాల లో 8.డిగ్రీలు, కొమురం భీమ్ జిల్లా తిర్యాణిలో 7.2 గా కనిష్ట ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టి లో 7.6 మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.6, నిర్మల్ జిల్లా పెంబిలో 9.4, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 10.2 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.