మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. కాగజ్నగర్ వాసులు మృతి
Road Accident:మహారాష్ట్ర(Maharastra)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad District)కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్(Kagaz Nagar) పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్ళింది. తిరిగి వస్తుండగా అర్ధరాత్రి దాటాక దేవాడ సోండో సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. దీంతో ముగ్గురు మహిళలు ఒక బాలిక ప్రమాద స్థలంలోనే మృత్యువాత పడ్డారు.
మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణం నిజాముద్దీన్ కాలనీకి చెందిన వారు. ఇక్కడ ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ భార్య సల్మా బేగం, కూతురు శబ్రీమ్, 14 నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతి చెందినట్లు జాకీర్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.