2026 షురూ!
ప్రపంచం కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. నూతన సంవత్సర వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. భూగోళం మీద అందరి కంటే ముందు న్యూజిలాండ్ 2026 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్లో అర్థరాత్రి 12 గంటలు (భారత కాల మాన ప్రకారం 4.30 గంటలకు) కావడమే ఆలస్యం.. నగరం మొత్తం వెలుగులతో నిండిపోయింది. స్కై టవర్ వద్ద జరిగిన బాణసంచా వేడుకలు జిగేల్మనిపించాయి. వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
న్యూజిలాండ్ కంటే ముందుగా పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి (Kiribati), సమోవా వంటి చిన్న ద్వీప దేశాలు 2026లోకి అడుగుపెట్టాయి. భౌగోళికంగా అంతర్జాతీయ దినరేఖకు దగ్గరగా ఉండటం వల్ల, ప్రపంచంలో కొత్త రోజును లేదా కొత్త ఏడాదిని ఆహ్వానించే మొదటి ప్రధాన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటిగా నిలుస్తుంది. న్యూజిలాండ్ తర్వాత తదుపరి వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరగనున్నాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాణసంచా ప్రదర్శనను వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు అక్కడ వేచి చూస్తున్నారు.
భారత్ సైతం మరో కొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ఆశలతో 2026ను ఆహ్వానించేందుకు యావత్ భారత్ సిద్ధమైంది.