అంజ‌న్న ద‌య‌వ‌ల్లే బ‌తికా…

Deputy cm pawan kalyan in kondagattu:అంజ‌న్న ద‌యవ‌ల్లే బ‌తికాన‌ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆల‌యాన్ని సంద‌ర్శించి మాట్లాడారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని స్ప‌ష్టం చేశారు. ఆయన దయవల్లే పెనుప్రమాదం నుంచి బైటపడినట్లు చెప్పారు. అంజన్నకు సేవచేసే భాగ్యం తనకు రావడం పూర్వజన్మ పుణ్యమన్నారు. ఇక్కడ దీక్షా విరమణకు సత్రం కావాలని అర్చకులు కోరుకున్నారు.. అదృష్టవశాత్తూ స్వామివారి కటాక్షం, ఆశీస్సులు లభించాయన్నారు.

శ‌నివారం జగిత్యాల కొండ గట్టు ఆలయం సందర్శించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రత్యేక హెలికాప్టర్ లో కొండ గట్టుకు చేరుకున్న ఆయ‌న టీటీడీ నిధుల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆలయ అధికారులు, పండితులు సంప్రదాయంగా స్వాగతం పలికారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అంజన్న ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించారు. తన ఇష్టమైన దైవం అంజన్న ఆలయంలో పవన్ కళ్యాణ్ ధ్యానం, పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన రూ.35.19 కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండపం కోసం భూమి పూజ నిర్వహించారు.

కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనకు చిన్ననాటి నుండి స్నేహితుడేనని, ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉంద‌న్నారు. గిరి ప్రదక్షణకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం త‌దిత‌రులు ఉన్నారు.

 

 

You might also like