బద్దిపోచమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు
వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. గ్రామ దేవత, శీతల దేవత అయిన బద్దిపోచమ్మ అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో బోనం మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మంగళవారం పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి బెల్లం బోనాలు, శాకంబరి నైవేద్యాలు (పట్నాలు), ఒడిబియ్యం సమర్పించి, పట్టుచీరలు, సారెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివసత్తుల పూనకాలు, జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.