బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం
Singareni:గోలేటి, MVK మెగా ఓపెన్ కాస్టు ప్రారంభం అయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని సింగరేణి (ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి గోలేటి, మహావీర్ ఖని (ఎంవీకే) ఓపెన్ కాస్ట్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. మొదట ఆయన బెల్లంపల్లి జీఎం కార్యాలయంలో అన్నివిభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఖైరిగూడ ఉపరితల గని ఉత్పత్తి, ఉత్పాదకత సమీక్షించారు. ఏరియాకు నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచనలిచ్చారు. గోలేటి ఉపరితల గని అనుమతులు , పనుల ప్రగతి తెలుసుకున్నారు.
కైరిగూడ ఓపెన్ కాస్ట్ త్వరలో మూసివేతకు గురయ్యే పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని ఏరియాల్లో మొక్కలు నాటడానికి నర్సరీలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రతిపాదిత MVK మెగా ఉపరితల గని పరిధి ప్రదేశాలు, సరిహద్దులను చూశారు. 3 ఇంక్లైన్ గ్రామం, మాదారం టౌన్ షిప్ లో పర్యటించారు. గోలేటి, MVK 1,2,3,5,6 ఉపరితల గనులు ప్రారంభం అయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, SO to GMకె రాజమల్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, ఎస్టేట్ అధికారులు సాగర్, రజినీకాంత్, సర్వే అధికారి నాగరాజు, మేనేజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్కు సన్మానం..
మాదారం టౌన్షిప్కు డైరెక్టర్ వెంకటేశ్వర్లు వచ్చిన సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కుశ్నపల్లి లక్ష్మీనారాయణ, వార్డు సభ్యుడు సూరం దామోదర్, నాయకులు పుట్ట శ్రీనివాస్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి శాలువాలతో సన్మానించారు.