మేడారంలో భక్తుల రద్దీ
Huge Crowd in Medaram : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ వనదేవతల దర్శనం కోసం భక్తులు ఇప్పుడే మేడారానికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని తట్టుకోలేమని భావించే వారు ముందుగానే దర్శనం చేసుకోవాలని రావడంతో, మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల తాకిడి పెరగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గద్దెల లోపలికి భక్తుల అనుమతిని నిలిపివేసి, గ్రిల్స్ బయటి నుంచే దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
భారీగా తరలివస్తున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బస్సులు, సొంత వాహనాల్లో భక్తులు వస్తుండడంతో పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ములుగు నుండి మేడారం వెళ్లే దారిలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. జాతర సమీపిస్తున్న కొద్దీ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరియు చిన్నపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.