జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా..?
Harish Rao is angry with the Revanth Reddy government:పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు(Former Minister Harish Rao) విమర్శించారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీవీ జర్నలిస్టులను అర్థరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందంటూ ప్రశ్నించారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా..? అని మండిపడ్డారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి మీడియాను మొత్తం భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మీడియా ఛానళ్లు, మీడియా హౌస్లను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్రెడ్డి భావిస్తున్నాడని అన్నారు. మీడియా అంటే ఆయనకు ఎందుకో కోపం ఉంది… ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోషాన్ని వెల్లగక్కాడని హరీష్రావు స్పష్టం చేశారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరి తెగిస్తారని, ప్రజలకు గొంతుక లేకుండా పోతుందన్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తున్నారని, జర్నలిస్టులు తీవ్రవాదులా..? ఉగ్రవాదులా…? అని ప్రశ్నించారు.
పోలీసులు అరెస్టు చేసిన పరిపూర్ణా చారి అనే జర్నలిస్టు మూడు రోజుల పాటు శబరిమలలో, లీవులో ఉన్నాడని చెప్పారు. అసలు ఈ విషయంతో సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేయడం ఏమిటన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టుల్లో సుధీర్ అనే జర్నలిస్టు దళిత బిడ్డ అని అతనిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని భావించారని..? ఇది ఏం ప్రజాస్వామం రేవంత్ రెడ్డి నీదంటూ ప్రశ్నించారాయన. సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోరాదంటూ ఎద్దేవా చేశారు. మీ ఖాకీ బుక్ ఏం చేబుతోంది..? కేటీఆర్ మీద కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఓ మంత్రి కుమారుడు బౌనర్లను పెట్టి భూములను కబ్జా చేశారు. ఆ మంత్రి కుమారున్ని, రాఘవ కన్సస్ట్రన్ కంపెనీ మీద చర్యలు లేవెందుకన్నారు. ఈ ఘటనలో నిజాయితీగా వ్యవహరించిన సీఐని బదిలీ చేశారని దుయ్యబట్టారు. ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్ జాతీయ రహదారి 44లో కంట్రాక్టర్ను కోట్ల రూపాయలు ఇవ్వాలని, మిషన్లు తగలబెడతామని బెదిరించారు. మరి కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. అప్పుడు చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టం అయ్యిందా అన్నారు.
అర్ధరాత్రి కాగానే రేవంత్రెడ్డిలో ఉన్న అరాచకవాది నిద్రలేస్తాడంటూ ఎద్దేవా చేశారు. పోలీసులను ప్రైవేటు సైన్యంగా మార్చుకున్నాడంటూ దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా రాత్రి పూటే పోలీసులను పంపించాడని, మహిళా జర్నలిస్టులను సైతం అర్ధరాత్రి పూట అరెస్టు చేయించిన ఘనత ఆయనదంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీదనే సిట్ వేస్తావా రేవంత్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీవీ ఇన్ఫుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్ను హైదరాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు.