ఫోన్ ట్యాపింగ్ కేసులో… హరీష్ రావుకు నోటీసులు
Phone tapping case:తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు BRS మాజీ MLAలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్రావు(Former Minister Harish Rao)కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఇటీవలే సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలోనే తన ఫోన్ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది.
దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది.