వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
మేడారం జాతర నేపథ్యంలో వేములవాడ (Vemulawada)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రద్దీ సాగుతోంది. మేడారం వెళ్లే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుండి భక్తులు పోటెత్తారు. కోడెమొక్కులు చెల్లించడానికి భక్తులు 3-4 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఆలయ ఆవరణం, కోడెమొక్కుల వద్ద భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయ ప్రాంగణంలో పర్యటిస్తూ భక్తుల వద్దకు వెళ్లి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 99,850కి చేరుకుంది. అలాగే, స్వామివారికి 9,860 కోడె మొక్కులు సమర్పించారు.