విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి
Maharashtra Deputy CM dies in plane crash:మహారాష్ట్రలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) మృత్యువాత పడ్డారు. పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో ఆయన దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP – అజిత్ పవార్ వర్గం) అధ్యక్షులు. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. 2024 డిసెంబరు 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు.
ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి రక్షణ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సర్వీస్ బృందాలు చేరుకున్నాయి. ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో చనిపోయారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Chief Minister Devendra Fadnavis), మరో ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే( Deputy Chief Minister Eknath Shinde), ఇతర నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.