ప్రతి రోజూ 2.2 లక్షల టన్నుల ఉత్పత్తి
Singareni:ఇక నుంచి ప్రతి రోజూ కనీసం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యంగా పనిచేయాలని సింగరేణి సీఎండీ డి. కృష్ణ భాస్కర్(Singareni CMD D.Krishna Bhaskar) అన్నారు. మంగళవారం సింగరేణి భవన్ నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యత తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు మార్కెట్లో వినియోగదారులు నాణ్యత ఉన్న బొగ్గును మాత్రమే తీసుకుంటున్నారని, కాబట్టి బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు ప్రతీ అధికారి, ఉద్యోగి ఈ దిశగా శ్రమిస్తేనే సంస్థకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది పలు కారణాల వల్ల నెలవారీ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కొంత వెనుకబడి ఉన్నామన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్లు (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణ, (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, (పర్సనల్, ఫైనాన్స్) గౌతమ్ పొట్రు, (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్) వెంకన్న, జీఎం (కో ఆర్డినేషన్ & మార్కెటింగ్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.