ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
ప్రజాదివస్లో భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజాదివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రతి సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పిర్యాదుదారుల నుండి మొత్తం 10 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు.