తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ (Telangana Cabinet) నిర్వహించారు. వేసవి మొదలైనందున వచ్చే మూడు నెలల పాటు తాగునీటి సరఫరా ప్రణాళికతో పాటు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చ కొనసాగింది.
ఈ కేబినేట్ భేటీలో జనగణన 2027 చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతారు. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. దీనికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనా వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు.
తొలిదశ విజయవంతంగా ముగిసిన తర్వాత, రెండో దశ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు ఈ గణన ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.