భారత్ కోసం హర్మూజ్ తెరుస్తాం..
Iran is a key decision: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై (Strait of Hormuz) ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్తో సహా ఐదు దేశాలకు చెందిన నౌకల ప్రయాణానికి హర్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తామని ఇరాన్(Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వం తమ మిత్ర దేశాలకు చెందిన నౌకలకు ఈ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. ఇందులో భారతదేశం, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. తమ మిత్ర దేశాల నౌకలు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే సురక్షితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ అనుమతి “శత్రుత్వం లేని నౌకలు”కే వర్తిస్తుందని, ఇరాన్పై దాడులకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హర్మూజ్ జలసంధి మూసివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉండగా, ఈ జలసంధి మూసివేయడం వల్ల చమురు, సహజ వాయువు, ఎరువుల సరఫరా తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. దీని ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోందని తెలిపారు.
హర్మూజ్ జలసంధి పరిస్థితి ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం వెళ్లే మార్గం కావడంతో, ఇక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అత్యవసరంగా మారింది.