మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskara Rao: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 16 వరకు కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యంత తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు. తెలుగుదేశం పార్టీ స్థాపనలో ఎన్.టి.రామారావు(N. T. Rama Rao)తో పాటు కీలక పాత్ర పోషించారు.

1935 జూన్ 23న గుంటూరులో జ‌న్మించిన ఆయ‌న‌ 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అడుగుపెట్టి, చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ స్థాపనలో కీలక భూమిక పోషించి, ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో, 1984 ఆగస్టులో కాంగ్రెస్ మద్దతుతో ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే నెల రోజుల తర్వాత ప్రజాస్వామ్య ఒత్తిడి కారణంగా ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.

ఎన్టీఆర్‌, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పని చేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2019 జూలైలో హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్, ప్రస్తుతం ఏపీ మంత్రిగా, జనసేన పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

You might also like