రాష్ట్ర పండువగా వాసవి మాత జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా (State Festival) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాసవి మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యవైశ్యుల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, వాసవి మాత సందేశమైన అహింస, శాంతిని వ్యాప్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆ పర్వదినం ఈ నెల 26న వస్తుండటంతో ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాసవి మాత జయంతిని తెలంగాణలో అధికారిక పండుగగా గుర్తించాలని ఆర్యవైశ్య సంఘాలు, భక్తులు చాలా కాలంగా కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.