తెలంగాణ సర్కార్కు షాక్
కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సీఎస్కు నోటీసులు
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో రైతులకు జరుగుతున్న ఇబ్బందులు, నిర్వాసితులు అవుతున్న కుటుంబాలు, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. శ్రవణ్ అనే న్యాయవాది గత నెల 30న ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన కమిషన్ బ్యాక్ వాటర్ సమస్య కారణంగా రైతులకు ఏ రూపంలో, ఎంత మేరకు నష్టం జరుగుతున్నదనే దానిపై నివేదిక అందించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. బ్యాక్ వాటర్ కారణంగా వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, పంట నష్టపరిహారం కూడా అందడం లేదని, మంచిర్యాలకు చెందిన రైతు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆ పిర్యాదులో న్యాయవాది స్పష్టం చేశారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతున్నారని, సరైన అధ్యయనం చేయకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో 30 వేల మంది వరకు రైతులు నష్టపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు ముంపు ఇబ్బందుల వల్ల రైతులు పూర్తి స్థాయిలో పంటలు నష్టపోతున్న విషయాన్ని ఆయన కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. సరైన అధ్యయనం చేసి రైతులకు పునరావాసం కల్పించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.