బెల్లంపల్లి లో పేకాటరాయుళ్ల అరెస్ట్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని ఆర్పి గార్డెన్లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని తాళ్ళగురిజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్పి గార్డెన్ యజమాని కూడా నిందితుల జాబితాలో ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం, తిరుమల హిల్స్ సమీపంలోని ఆర్పి గార్డెన్లో పేకాట నిర్వహిస్తున్నరన్న విశ్వసనీయ సమాచారంతో తాళ్లగురిజాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.1,28,240 నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పట్టుబడిన వారిలో ఆర్పి గార్డెన్ యజమాని ఎండీ హఫీజ్ కూడా ఉండటంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గార్డెన్లో కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్న నేపథ్యంలో, పోలీసుల దాడితో ఆ ఆరోపణలకు బలం చేకూరిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పేకాట స్థావరంగా మారిందనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్పి గార్డెన్ నిర్వహణపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పేకాట నిర్వహణ వెనుక మరెవరైనా ఉన్నారా..? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది..? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.