కలెక్టర్ ను కలిసిన సింగరేణి జీఎం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరితను బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీరమేష్ గురువారం కలిశారు. రమేష్ జీఎంగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సందర్బంగా మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా పరిధిలోని బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణపై కలెక్టర్తో జీఎం సుదీర్ఘంగా చర్చించారు. బెల్లంపల్లి ఏరియా అభివృద్ధిలో గోలేటి ఓపెన్ కాస్ట్ గని ఎంతో కీలకమైనదని, దీనిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జీఎం కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం ఏరియా పరిధిలో కేవలం ఒక్క ‘ఖైరిగుడ’ ఉపరితల గని నుండి మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
బెల్లంపల్లి ఏరియాలో భవిష్యత్తులో ప్రారంభం కానున్న గనులు, ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న వివిధ మైనింగ్ ప్రాజెక్టుల వివరాలను ఈ సందర్భంగా కలెక్టర్కు సమర్పించారు. కొత్త గనుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతులు వేగంగా లభించేలా సహకారం అందించాలని జీఎం కలెక్టర్ను కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.