విధి నిర్వహణంలో విషాదం.. డీటీవో అక్కడికక్కడే మృతి
వాహన తనిఖీలు చేస్తుండగా టిప్పర్ ఢీకొనడంతో ఓ డీటీవో ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో జరిగిన ఈ ఘటనలో డీటీవో మృత్యువాతపడ్డారు. చెల్పూరులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట డీటీవో వెంకన్న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ టిప్పర్ని ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి, ఆయనపై నుంచి దూసుకెళ్లింది. DTO వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వెంకన్న మృతదేహం నుజ్జు నుజ్జెంది.
15 రోజుల కిందటే ఆయన జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ప్రమాదం రవాణా శాఖ కార్యాలయం ఎదురుగానే జరిగింది. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదమా లేక తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.