మీ సహకారం లేకనే ఆలస్యం
కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు భరించాల్సిన వ్యయాన్ని, కావల్సిన భూకేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సకాలంలో ప్రాజెక్టు లు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.
మోదీ ప్రధానిగా వచ్చాక తెలంగాణకు నిధుల కేటాయింపు 9 రెట్లు పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2014-15 బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021-22 నాటికి కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని వివరించారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ 194 రూట్ కిలోమీటర్లు పెరిగినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల వాటా పెండింగ్లో ఉందన్నారు. 342 హెక్టార్ల భూమి రైల్వేకు అప్పగించాల్సి ఉందని..అది ఇంత వరకు జరగలేదన్నారు. అక్కన్నపేట-మెదక్ రైలుమార్గంలో 31కోట్ల నిధులు, 1 హెక్టారు భూమిని అప్పగించాల్సి ఉందన్నారు.
ఎంఎంటీఎస్ ఫేజ్ టూ ప్రాజెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం 760 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 129 కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. 54 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరైనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి సరైన సహకారం లేదన్నారు. కృష్ణా నుంచి వికారాబాద్, కరీంనగర్ నుంచి హసన్పర్తి, బోధన్ నుంచి లాతూర్ కొత్త రైల్వే లైన్ మూడు ప్రాజెక్టుల సర్వే పూర్తయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాపై ధృవీకరణ ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు.